ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు అతి ఘోరమైన పాపముల గురించి తెలుపుతూ, ఈ మూడు పాపములను ప్రస్తావించినారు: 1. ఇతరులను అల్లాహ్ కు సమానులుగా చేయడం – అంటే ఏవైనా ఆరాధనలను అల్లాహ్ కు గాక ఇతరులకు అంకితం చేయడం, ఆ విధంగా అల్లాహ్ యొక్క దైవత్వములో, ఆయన ప్రభుతలో (ఆయన ప్రభువు హోదాలో), ఆయన నామములలో మరియు ఆయన గుణగణాలలో ఇతరులను ఆయనకు సమానులుగా లేదా సాటిగా చేయడం, వారిని లేదా వాటిని ఆయనకు భాగస్వాములుగా చేయడం. 2. తల్లిదండ్రుల పట్ల అవిధేయత: అంటే మాటలలో గానీ, చేతలలో గానీ తల్లిదండ్రులకు హాని కలిగేలా, బాధ కలిగేలా ప్రవర్తించడం, వారి పట్ల ప్రేమాభిమానాలతో, దయతో మెలగకుండా వారిని పట్టించుకోక పోవడం, వదిలివేయడం. 3. అబద్ధాలాడుట మరియు అబద్ధపు సాక్ష్యము చెప్పుట: ఇది ఒకరి నుండి ధనం లేదా భూమి తీసుకుని, దానిని అతనికి తిరిగి ఇవ్వకుండా కాజేసే ఉద్దేశ్యంతో, అలాగే ఒకరి గౌరవాన్ని, ప్రాభవాన్ని మంటగలిపే ఉద్దేశ్యంతో చెప్పే ఏ అబద్ధమైనా, తప్పుడు మాటైనా, వాంగ్మూలమైనా, ప్రకటనైనా లేక అలాంటిది ఏదైనా దీని క్రిందకు వస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘అబద్ధాలాడుట మరియు అబద్ధపు సాక్ష్యము చెప్పుట’ ను గురించి పలుమార్లు హెచ్చరించడం, సమాజంపై దాని దుష్పరిణామాలను చూసి, దాని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాటలలో వ్యక్తమయ్యే వ్యాకులతను చూసి సహాబాలు "అయ్యో! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇకనైనా ఆపితే బాగుండు" అని అనుకో సాగినారు.