ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్’ను (తన సమాజాన్ని) ఏడు వినాశకరమైన, ఘోరమైన నేరములు మరియు పాపముల నుండి దూరంగా ఉండమని ఆదేశించారు. “అవి ఏమిటి?” అని ప్రశ్నించగా, “అవి ఇవి” అని ఆయన వాటి గురించి వివరించినారు. మొదటిది: అల్లాహ్’కు సాటి కల్పించుట – అంటే, అది ఏ రూపంలోనైనా సరే ఆయన స్థానములో మరొకరిని తీసుకొనుట, ఏ రూపములోనైనా సరే అల్లాహ్’కు మరొకరితో సాదృశ్యము కల్పించుట, మరొకరిని అల్లాహ్’తో పోల్చుట, పరమ పవిత్రుడైన అల్లాహ్ కొరకు గాక ఏ ఆరాధననైనా వేరొకరి కొరకు (మిధ్యాదైవాల కొరకు) ఆచరించుట, మరియు బహుదైవారాధనతో ఆరంభించారు. ఎందుకంటే అది అతిపెద్ద పాపము. రెండవది: చేతబడి. దీనిలో (చేతబడిలో భాగంగా) దారములపై ముడులు వేయుట, మంత్రతంత్రాలు ఉచ్ఛరించుట, చేతబడి కొరకు మందులు మాకులు ఉపయోగించుట, ధూపదీపాలు వేయుట, తద్వారా చేతబడి చేయబడిన వాని ప్రాణం పోయేలా చేయుట లేదా అతణ్ణి వ్యాధికి గురి చేయుట – ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ షైతాను చర్యలు. వీటిలో చాలా పనులు కేవలం బహుదైవారాధనలకు పాల్బడడం ద్వారా మరియు తనకు ప్రియమైన ఏదో ఒక పైశాచిక ఆత్మలకు సమర్పించుకోవడం ద్వారా తప్ప సాధ్యం కావు. మూడవది: దేశాధినేత ద్వారా షరియత్ పరమైన ఔచిత్యము అమలు చేయబడితే తప్ప, “చంపరాదు” అని అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణినైనా చంపుట. నాలుగవది: ప్రత్యక్షంగా వడ్డీ లావాదేవీలలో పాల్గొంటూ లేదా మరేదైనా పరోక్ష విధానాలతో వడ్డీల ద్వారా లాభం పొందుతూ, వడ్డీ వ్యవహారాలను నిర్వహించడం. ఐదవది: తండ్రి చనిపోయి, యుక్తవయస్సుకు ఇంకా చేరని అనాథల సొమ్మును అన్యాయముగా తినుట. ఆరవది: అవిశ్వాసులతో జరుగుతున్న యుధ్ధంలో యుద్ధభూమి నుండి వెన్నుచూపి పారిపోవుట. ఏడవది: శీలవతులైన స్త్రీలపై వ్యభిచారపు నిందారోపణలు చేయుట, అదే విధంగా అమాయక పురుషులను కూడా దోషులుగా నిలబెట్టుట.