ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొంత మంది సహచరులతో ఉన్నారు, అపుడు ఆయన తన చేతిపై విధేయతా ప్రతిజ్ఞ చేయమని మరియు కొన్ని విషయాలకు కట్టుబడి ఉంటామని వాగ్దానం చేయమని వారిని మూడుసార్లు అడిగారు: మొదటిది: అల్లాహ్ ఆదేశించిన విషయాలను ఆచరిస్తూ, ఆయన నిషేధించిన వాటి నుండి దూరంగా ఉంటూ కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధిస్తామని, ఆయనకు ఎవరినీ సాటి కల్పించము అని; రెండవది: పగలు మరియు రాత్రి కాలములో అల్లాహ్ విధిగావించిన ఐదు నమాజులను విధిగా ఆచరిస్తామని; మూడవది: ముస్లిములకు మంచి జరిగే విషయాలలో మరియు వారి అభ్యున్నతికి చెందిన విషయాలలో పాలకుని మాట వింటామని మరియు అతనికి విధేయులై ఉంటామని, నాలుగవది: తమ ప్రతి అవసరానికీ కేవలం అల్లాహ్ ను మాత్రమే అర్థిస్తామని, ప్రజలను దేని కొరకూ అర్థించము అని. ఈ మాటలను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లోగొంతుకలో పలికినారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహబాలు, వారు చేసిన విధేయతా ప్రమాణమును తు.చ. తప్పకుండా ఆచరించినారు. చివరికి ఈ హదీసు ఉల్లేఖకుడు ఈ విధంగా పలికినారు: కొంతమంది తమ చేతి నుండి కొరడా, చెర్నకోలా (కమ్చీ) నేలపై జారిపడినా దానిని ఎత్తి ఇవ్వమని కూడా ఎవరినీ అర్థించే వారు కాదు. వారు స్వయంగా తమ వాహనం పై నుండి (ఒంటె, గుర్రము, గాడిద మొ.) దిగి తీసుకునేవారు.”