ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: ప్రళయ దినాన సూర్యుడు ప్రజలకు చాలా దగ్గరగా తీసుకురాబడతాడు. వారి తలలకు కేవలం ఒక మైలు (మీల్) దూరంలో మాత్రమే ఉంటాడు. తాబియీ తరానికి చెందిన సులైమ్ బిన్ ఆమిర్ ఇలా అన్నారు: "అల్లాహ్ సాక్షిగా, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పేర్కొన్న 'మీల్' అంటే, ఆయన భూమిపై మైలు దూరాన్ని ఉద్దేశించారా, లేక కంటికి కాటుక (సుర్మా) పెట్టే చిన్న కడ్డీని ('మీల్') ఉద్దేశించారా అనేది నాకు అర్థం కాలేదు." ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ప్రళయ దినాన ప్రజలు తమ తమ కర్మల ప్రకారం చెమటలో మునిగి ఉంటారు. వారిలో కొందరికి చెమట కాలి చీలమండలముల వరకూ ఉంటుంది, కొందరికి మోకాళ్ల వరకూ, మరికొందరికి నడుము వరకూ, ఇంకొంతమందికి చెమట నోటిదాకా చేరి, వారు మాట్లాడలేని స్థితిలో ఉంటారు." ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతితో తన నోటివైపు చూపించారు.