ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: మన కంటే ముందుతరాలలో ఒక రాజు ఉండేవాడు మరియు అతని వద్ద ఒక ఆస్థాన మాంత్రికుడు ఉండేవాడు. ఆ మాంత్రికుడు ముసలివాడు అయినపుడు అతడు రాజుతో ఇలా అన్నాడు: “నేను ముసలి వాడిని అయిపోయాను. ఎవరైనా ఒక యువకుడిని నా వద్దకు పంపించండి, అతనికి ఈ మంత్రజాల విద్య నేర్పిస్తాను.” దానిపై రాజు ఒక యువకుడిని మంత్రజాల విద్య నేర్పించడానికి ఆ మాంత్రికుని వద్దకు పంపించినాడు. ఆ యువకుడు మాంత్రికుని వద్దకు ఎప్పుడు వెళ్ళుతున్నా దారిలో ఒక రాహిబ్ కూర్చుని ఉండటం చూసేవాడు. ఒకసారి ఆ యువకుడు రాహిబ్ వద్ద కొంచెంసేపు ఆగి, అతని ప్రక్కన కూర్చుని అతను చెప్పినదంతా విన్నాడు. అతనికి ఆ రాహిబ్ మాటలు బాగా నచ్చాయి. ఆ తరువాత అతడు ఎప్పుడు మాంత్రికుని దగ్గరకు వెళ్ళుతున్నా దారిలో ఆ రాహిబ్ వద్ద కూర్చొనేవాడు. ఆలస్యంగా వచ్చినందుకు ఆ మాంత్రికుడు అతడిని దండించేవాడు. ఆ యువకుడు రాహిబ్ కు ఈ విషయం గురించి చెప్పాడు. దానికి రాహిబ్ ఇలా అన్నాడు: “నీవు మాంత్రికుడిని గురించి భయపడుతున్నట్లైతే, మీ ఇంటివాళ్ళు ఆపినారు అని చెప్పు, మరి మీ ఇంటివాళ్ళను గురించి భయపడుతున్నట్లైతే ఆ మాంత్రికుడు ఆపినాడు అని చెప్పు.” ఇలా రోజులు గడుస్తుండగా, ఒకరోజు దారిలో ఒక పెద్ద, భయంకరమైన జంతువు కనిపించింది. అది ప్రజలను ఆ దారిపై నడవకుండా భయభ్రాంతులను చేస్తున్నది. అపుడు ఆ యువకుడు తనలో తాను ఇలా అనుకున్నాడు: “ఈ రోజు నేను తెలుసుకుంటాను ఆ మాంత్రికుడు గొప్పవాడో లేదా ఆ రాహిబ్ గొప్పవాడో." అతడు ఒక రాయిని చేతిలోనికి తీసుకుని: “ఓ అల్లాహ్! ఒకవేళ ఆ రాహిబ్ విషయం నీకు ఆ మాంత్రికుని విషయం కంటే అత్యంత ప్రియమైనది అయితే, ఈ జంతువును చంపి ప్రజలు ఈ దారిపై నడిచేలా చేయి” అంటూ ఆ రాయిని ఆ జంతువు పైకి విసిరాడు. దానితో అది చనిపోయింది. ప్రజలు ఆ దారిపై స్వేచ్ఛగా నడవసాగారు. తరువాత అతడు ఆ రాహిబ్ వద్దకు వచ్చి జరిగిన విషయం అతని తెలియజేసాడు. అపుడు ఆ సన్యాసి ఆ యువకునితో ఇలా అన్నాడు: ఉన్న “కుమారా! ఈ రోజు నీవు నాకంటే గొప్పవాడవు అయ్యావు. నేను ఏదైతే చూసినానో నీవు దానిని సాధించినావు. అనతి కాలములోనే నీవు పరీక్షకు గురిచేయబడతావు. ఒకవేళ నీవు పరీక్షకు గురిచేయబడితే నా పేరు బయట పెట్టకు.” తరువాత ఆ యువకుడు అల్లాహ్ అనుమతితో పుట్టుగ్రుడ్డివారిని, కుష్ఠు వ్యాధి రోగులను, ఇతర వాధిగ్రస్తులను నయం చేయసాగినాడు. రాజుగారి ఆస్థానములోని సహచరుడు ఒకడు కంటి చూపు కోల్పోయి గ్రుడ్డివాడైపోయాడు. అతడు ఆ యువకుని గురించి విన్నాడు. అతడు చాలా కానుకలతో ఆ యువకుని వద్దకు వచ్చి అతనితో ఇలా అన్నాడు: “నీవు ఒకవేళ నాకు నయం చేసినట్లైతే ఈ కానుకలన్నీ నీవే”. దానికి ఆ యువకుడు ఇలా అన్నాడు: “నేను ఎవరికీ నయం చేయను, అల్లాహ్’ మాత్రమే నయం చేయువాడు. ఒకవేళ నీవు అల్లాహ్’ను విశ్వసించినట్లైతే, నీకు నయం చేయమని నేను ఆయనను వేడుకుంటాను మరియు ఆయన నయం చేస్తాడు.” అతడు అల్లాహ్ ను విశ్వసించినాడు మరియు అల్లాహ్ అతనికి నయం చేసినాడు. తరువాత అతడు రాజు గారి వద్దకు వెళ్ళి ఆయన సభలో, అతడు సాధారణంగా ఎక్కడైతే కూర్చుంటాడో, అక్కడ కూర్చున్నాడు. అతడిని చూసి రాజు అతనితో ఇలా అన్నాడు: “నీ కంటి చూపు తిరిగి వచ్చేలా చేసింది ఎవరు?” అతడు ఇలా అన్నాడు: “నా ప్రభువు”. దానికి రాజు: “నేను కాక నీకు మరొక ప్రభువు కూడా ఉన్నాడా?” అతడు ఇలా అన్నాడు: “నా ప్రభువు మరియు నీ ప్రభువు కూడా అల్లాహ్’యే”. రాజు అతడిని తీసుకు వెళ్ళి తీవ్రంగా హింసించినాడు. చివరికి అతడు ఆ యువకుడి గురించి వెల్లడించినాడు. ఆ యువకుడు రాజు వద్దకు తీసుకు రాబడినాడు. రాజు అతనితో ఇలా అన్నాడు: “కుమారా! నీవు నేర్చుకున్న మంత్రజాలం పుట్టుగ్రుడ్డి, కుష్ఠు రోగములను నయం చేయడమేకాక ఇంకా నీవు అలా అలా చేసేవరకూ చేరుకుంది.” దానికి ఆ యువకుడు ఇలా అన్నాడు: “నేను ఎవరికీ స్వస్థత చేకూర్చను. స్వస్థత చేకూర్చేవాడు కేవలం అల్లాహ్’యే”. రాజు అతడిని కూడా తీసుకు వెళ్ళి తీవ్రంగా హింసించినాడు. చివరికి అతడు ఆ రాహిబ్ గురించి వెల్లడించినాడు. అపుడు ఆ రాహిబ్ తీసుకురాబడినాడు; అతడికి “నీ ధర్మాన్ని వదిలి వేయి” అని ఆదేశించబడింది. అతడు నిరాకరించినాడు. రాజు ఒక రంపాన్ని తెప్పించి అతడి తల మధ్యలో ఉంచి, అతడి శరీరాన్ని నిలువుగా రెండు ముక్కలుగా చీల్చినాడు. తరువాత రాజు యొక్క అనుచరుడు తీసుకు రాబడినాడు, అతనికి “నీ ధర్మాన్ని వదిలివేయి” అని ఆదేశించడం జరిగింది. దానికి అతడు నిరాకరించినాడు. అతని తల మీద కూడా రంపాన్ని ఉంచి అతడిని కూడా నిలువుగా రెండు ముక్కలుగా చీల్చడం జరిగింది. తరువాత ఆ యువకుడు తీసుకు రాబడినాడు. అతడిని కూడా అతని ధర్మాన్ని వదిలి వేయమని ఆదేశించడం జరిగింది. దానికి అతడు కూడా నిరాకరించినాడు. రాజు తన సహచరులలో ముగ్గురు నుండి పది మంది వరకు భటులను ఎన్నుకుని, వారికి అతడిని అప్పగించినాడు. వారితో రాజు ఇలా అన్నాడు: “ఇతడిని ఫలానా పర్వతం వద్దకు తీసుకు వెళ్ళండి, అతనితో పాటు పర్వతం మీదకు ఎక్కండి, ఒకవేళ తడు తన ధర్మాన్ని వదిలి వేయనట్లైతే అతడిని పర్వతం పై నుండి క్రిందకు విసిరివేయండి”. వారు అతడిని తీసుకుని వెళ్ళి అతనితో పాటు పర్వతం పై భాగానికి చేరుకున్నారు. ఆ యువకుడు ఇలా దుఆ చేసాడు: “అల్లాహుమ్మ అక్’ఫినీహిం బిమా షి’త” (ఓ అల్లాహ్, నువ్వు ఎలా కోరుకుంటే అలా (నీకు ఇష్టమైన విధంగా) నన్ను వీరి నుండి రక్షించు). దానితో పర్వతం కంపించి తీవ్రంగా కంపించింది; రాజు యొక్క అనుచరులు పర్వతం పైనుండి క్రిందకు పడిపోయారు. ఆ యువకుడు నడుచుకుంటూ రాజువద్దకు వెళ్ళాడు. రాజు అతడిని చూసి ఇలా అడిగాడు: “నీ వెంట వెళ్ళిన సహచరులకు ఏమైంది?” అతడు ఇలా అన్నాడు: “అల్లాహ్ వారి నుండి నన్ను రక్షించినాడు.” దానితో రాజు తన సహచరుల మరొక సమూహానికి అతడిని అప్పగించి వారితో ఇలా అన్నాడు: “ఇతడిని ఒక పడవలో సముద్రం మధ్యకు తీసుకు వెళ్ళండి. ఇతడు తన ధర్మాన్ని వదిలివేసినాడా సరే, లేకపోతే ఇతడిని సముద్రం లోనికి విసిరి వేయండి.” వారు అతడిని తీసుకెళ్లారు, అక్కడ అతను ఇలా దుఆ చేసాడు: “అల్లాహుమ్మ అక్’ఫినీహిం బిమా షి’త” (ఓ అల్లాహ్, నువ్వు ఎలా కోరుకుంటే అలా, (నీకు ఇష్టమైన విధంగా) వీరి నుండి నన్ను రక్షించు). అప్పుడు ఓడ తిరగబడింది మరియు వారు మునిగిపోయారు, మరియు అతను రాజు వద్దకు నడుచుకుంటూ వచ్చాడు. రాజు అతడిని ఇలా అడిగాడు: “నీ వెంట వెళ్ళిన సహచరులకు ఏమైంది?” ఆ యువకుడు రాజుతో ఇలా అన్నాడు: “అల్లాహ్ వారి నుండి నన్ను రక్షించినాడు.” ఆ యువకుడు రాజుతో ఇంకా ఇలా అన్నాడు: “చూడు, నేను ఆదేశించిన విధంగా చేస్తే తప్ప నీవు నన్ను చంపలేవు”. రాజు అడిగాడు “అది ఏమిటి?” ఆ యువకుడు ఇలా అన్నాడు: “ప్రజలను ఒక ప్రధానమైన కూడలిలో సమావేశపరిచి, నన్ను ఒక చెట్టు కాండానికి సిలువ వేయి. తరువాత నా అంబులపొది నుండి ఒక బాణాన్ని తీసుకొని, ఆ బాణాన్ని వింటిలోనికి ఎక్కించి, “ఈ యువకుని ప్రభువు అయిన అల్లాహ్ నామమున (ఈ బాణం వదులు తున్నాను)” అని పలికి బాణాన్ని వదులు. అలా చేస్తేనే నీవు నన్ను చంపగలుగుతావు”. యువకుడు చెప్పిన విధంగానే రాజు ఒక ప్రధాన ప్రదేశములో ప్రజలందరినీ సమావేశపరిచినాడు. యువకుడిని ఒక చెట్టు కాండానికి శిలువ వేసినాడు. ఆ బాలుని అంబుల పొది నుండి ఒక బాణాన్ని తీసి విల్లు ఎక్కుపెట్టి ఇలా పలికినాడు: “ఈ యువకుని ప్రభువు అయిన అల్లాహ్ నామమున (ఈ బాణాన్ని వదులుతున్నాను)” అంటూ బాణాన్ని వదిలినాడు. ఆ బాణం సూటిగా వెళ్ళి ఆ యువకుని కన్ను మరియు చెవికి మధ్య కణతను తాకింది. ఎక్కడైతే బాణం తాకిందో అక్కడ కణతపై చేయి ఉంచి అతడు చనిపోయాడు. అంతే, అక్కడ గుమిగూడిన ప్రజలందరూ ఒక్కసారిగా “మేము ఆ యువకుడి ప్రభువును విశ్వసించినాము, మేము ఆ యువకుడి ప్రభువును విశ్వసించినాము, మేము ఆ యువకుడి ప్రభువును విశ్వసించినాము” అని ఎలుగెత్తి అన్నారు. అప్పుడు ఆ రాజుతో ఇలా అనబడింది: “చూసారా, మీరు దేని గురించి అయితే భయపడినారో, అదే జరిగింది." "అల్లాహ్ సాక్షిగా! నీవు భయపడిన విషయం నీ పట్ల నిశ్చయంగా జరిగిపోయింది. ప్రజలు ఆ యువకుడిని అనుసరిస్తారు; వారందరూ అతని ప్రభువును విశ్వసిస్తారు." అపుడు రాజు రహదార్ల ప్రవేశ ద్వారాల వద్ద మైదానంలో గొప్ప దీర్ఘచతురస్రాకార గుంటలను త్రవ్వమని ఆదేశించినాడు. ఆ తర్వాత ఆ గోతులలో అగ్నిమంటలు రాజేసి, 'ఎవరు తమ ధర్మాన్ని విడిచి పెట్టరో వారిని అందులో పడవేయండి' అని ఆదేశించాడు. వారు రాజు ఆజ్ఞాపించినట్లుగానే చేశారు. చివరగా ఒక స్త్రీ తన పసిబిడ్డతో వచ్చింది, ఆమె అక్కడే ఆగిపోయి, అగ్నిలో దూకడానికి వెనకాడింది. అప్పుడు ఆమె పసిబిడ్డ (అల్లాహ్ మహిమ వలన శిశువు అయినా మాట్లాడాడు) ఆమెతో ఇలా అన్నాడు: “ఓ అమ్మా! సహనం వహించు, నిశ్చయంగా నీవు సత్యమార్గముపైనే ఉన్నావు”.