ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విషయాన్ని ఈ విధంగా స్పష్టపరుస్తున్నారు. నమాజు ఆచరిస్తున్న వ్యక్తి ఒకవేళ తన నమాజు లో అయోమయంలో పడిపోతే, తాను ఎన్ని రకాతులు చదివినాడో జ్ఞాపకంలేకపోతే, అంటే మూడు రకాతులు చదివినాడా లేక నాలుగు రకాతులు చదివినాడా నిర్ణయించుకోలేక పోతున్నట్లయితే, సందేహాన్ని కలిగిస్తున్న ఆ అదనపు రకాతు విషయాన్ని వదిలివేయాలి. ఇక్కడ మూడా లేక నాలుగా అనే సందేహంలో, మూడు రకాతులు అనేది ఖచ్చితమైన విషయం. కనుక అతడు నాలుగవ రకాతు చదివి చివరన నమాజును సలాం తో ముగించడానికి ముందు రెండు సజ్దాలు (సుజూద్ అస్’సహ్వ్) చేయాలి. ఒకవేళ అతడు వాస్తవములో నాలుగు రకాతులు చదివి ఉంటే, అదనంగా చదివిన ఒక రకాతుతో మొత్తం ఐదు రకాతులు అవుతాయి. నమాజు చివరన, సలాంతో నమాజును ముగించడానికి ముందు చేసిన రెండు అదనపు సజ్దాలు ఒక రకాతుగా పరిగణించబడతాయి. ఆ విధంగా నమాజులో రకాతుల సంఖ్య బేసి, కాకుండా సరి సంఖ్య అవుతుంది. ఒకవేళ అతడు వాస్తవములో నాలుగు రకాతులే చదివి ఉంటే అతడు నమాజును ఆచరించవలసిన విధంగానే, ఎక్కువ తక్కువ లేకుండా ఆచరించాడన్నమాట. ఆ స్థితిలో, సలాంతో నమాజును ముగించడానికి ముందు చేసిన రెండు అదనపు సజ్దాలు (సుజూద్ అస్’సహ్వ్) షైతానుకు పరాభవంగా మారుతాయి, ఆ రెండు సజ్దాలు అతడిని పరాభవంతో, అతడి లక్ష్యం నుండి అతడిని దూరంగా తరిమివేస్తాయి. ఎందుకంటే అతడు అల్లాహ్ యొక్క దాసుడిని నమాజు’లో అయోమయానికి గురిచేసి, అతని నమాజు భంగపడేలా చేయాలని యోచించినాడు. కానీ అల్లాహ్ ఆదేశాలకు విధేయుడై ఆదమ్ కుమారుడు రెండు సజ్దాలు చేస్తూ, షైతానుకు (అతని ప్రభావానికి) అవిధేయత చూపినప్పుడు అతని నమాజు పరిపూర్ణమయ్యింది. అదే షైతాను – ఆదమ్ (అలైహిస్సలాం) కు సజ్దా చేయమని అల్లాహ్ ఆదేశించినపుడు అల్లాహ్ ఆదేశాన్ని తిరస్కరించి అవిధేయుడైనాడు.