ఈ హదీసులో ఉమ్ముల్ ము’మినీన్ (విశ్వాసుల మాతృమూర్తి) మైమూనహ్ రజియల్లాహు అన్హా జనాబత్ స్థితి నుండి పరిశుద్ధత పొందుటకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరించిన గుస్ల్ విధానమును గురించి తెలియజేస్తున్నారు. (సంభోగము వలన గానీ లేక స్వప్నస్ఖలనం వలన గానీ మనిషి లోనయ్యే అశుద్ధస్థితిని ‘జనాబత్’ స్థితి అంటారు). ఆమె ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్నానం చేయుట కొరకు నీటిని తోడి పెట్టి, ఒక వస్త్రాన్ని పరదాలా ఏర్పాటు చేసినారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా (గుస్ల్) ఆచరించినారు. మొదటిది: నీటి పాత్రలో చేతులు పెట్టడానికి ముందు ఆయన తన రెండు చేతులను కడుక్కున్నారు. రెండవది: కుడి చేతితో ఎడమ చేతిలోనికి నీళ్ళు తీసుకుని ఆ నీటితో, సంభోగపు చాయలు, అశుద్ధత, తొలిగిపోయేలా తన మర్మస్థానాన్ని శుభ్రపరుచుకున్నారు. మూడవది: తన చేతిని నేలపై చరిచి, నేలపై రుద్ది తరువాత ఆ చేతి నుండి మలినం దూరమై పోయేలా నీటితో కడుక్కున్నారు. నాలుగవది: నోటిలోనికి నీళ్ళు తీసుకుని, బాగా గరగరలాడిస్తూ అటూ ఇటూ తిప్పి ఆ నీటిని దూరంగా పుక్కిలించి ఊసినారు. తరువాత ఉచ్ఛ్వాస ద్వారా ముక్కులోనికి నీటిని తీసుకుని ముక్కును శుభ్రపరుచుకుని చీదేసినారు. ఐదవది: ముఖాన్ని కడుక్కున్నారు, చేతులను మోచేతుల వరకు కడుక్కున్నారు. ఆరవది: తన తలపై నీళ్ళు పోసుకున్నారు. ఏడవది: తన మొత్తం శరీరంపై నీళ్ళు పోసుకున్నారు. ఎనిమిదవది: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తాను గుస్ల్ ఆచరించిన స్థలం నుండి పూర్తిగా ప్రక్కకు జరిగి అక్కడ, గుస్ల్ లో భాగంగా కడగని తన కాళ్ళను అక్కడ కడుక్కుని శుభ్రపరుచుకున్నారు. ఆ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గుస్ల్ ఆచరించిన తరువాత శరీరాన్ని తుడుచుకొనుటకు గానూ మైమూనహ్ రజియల్లాహు అన్హా వారికి ఒక వస్త్రాన్ని తెచ్చి ఇచ్చినారు. కానీ వారు దానిని తీసుకోకుండా చేతులతో శరీరం నుండి నీటిని తుడిచి వేస్తూ, చేతులను విదిలించినారు.