ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక యుద్ధ యాత్రలో తన సహచరులైన ముహాజిర్లు మరియు అన్సార్లతో (రదియల్లాహు అన్హుమ్) కలిసి ప్రయాణిస్తుండగా, ముహాజిర్లలోని ఒక వ్యక్తి అన్సార్లలోని ఒక వ్యక్తి పిరుదులపై తన చేతితో కొట్టాడు. అప్పుడు అన్సారీ, 'నాకు సహాయం చేయండి ఓ అన్సారులారా' అని, మరియు ముహాజిర్, 'నాకు సహాయం చేయండి ఓ ముహాజిరులారా' అని పిలవగా, దానిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విని, 'ఇదేమిటి?' అని పలికారు. వారు ఇలా అన్నారు: ముహాజిర్ లకు చెందిన ఒక వ్యక్తి, అన్సార్ లకు చెందిన ఒక వ్యక్తిని వెనుక భాగంపై తన చేతితో కొట్టాడు, అప్పుడు ఆ అన్సారీ, ‘ఓ అన్సారులారా! నన్ను ఆదుకోండి’ అని అన్నాడు, మరియు ఆ ముహాజిర్, ‘ఓ ముహాజిరులారా! నన్ను ఆదుకోండి’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఈ అజ్ఞాన కాలపు అలవాటును విడిచిపెట్టండి, ఎందుకంటే ఇది నీచమైనది, అసహ్యకరమైనది మరియు బాధాకరమైనది; అదేమిటంటే, ఒక వ్యక్తి తన ప్రత్యర్థి చేతిలో ఓడిపోయినప్పుడు, అతను తన జాతి వారిని పిలుస్తాడు, అప్పుడు వారు, అతను అన్యాయం చేసేవాడైనా లేదా అన్యాయానికి గురైనవాడైనా సరే, తమ అజ్ఞానం మరియు గుడ్డి పక్షపాతం కారణంగా అతనికి సహాయం చేయడానికి పరుగెత్తుకు వస్తారు.” జాబిర్ తెలిపారు: ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ హిజ్రత్ చేసి మదీనా వచ్చినప్పుడు అన్సారులు ఎక్కువగా ఉండేవారు, ఆ తర్వాత ముహాజిర్లు ఎక్కువయ్యారు. అప్పుడు కపటుల సర్దారు అబ్దుల్లా బిన్ ఉబై బిన్ సలూల్ ఇలా పలికాడు: "విషయం ఈ స్థాయికి చేరిందా?! అల్లాహ్ సాక్షిగా, మనం మదీనాకు తిరిగి వెళ్ళిన తరువాత గౌరవనీయులమైన మనం - అంటే నేను మరియు నాతో ఉన్నవారు - మదీనా నుండి నీచులను - అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయనతో ఉన్నవారు - తప్పకుండా వెళ్ళగొడతాము. అప్పుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు, "ఓ ప్రవక్తా! నన్ను వదిలి వేయండి, ఈ కపటవిశ్వాసి మెడ నేను నరుకుతాను" అని అన్నారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, "అతన్ని వదిలిపెట్టు. ప్రజలు 'ముహమ్మద్ తన అనుచరులనే చంపుతున్నాడు' అని మాట్లాడుకోకూడదు" అని సెలవిచ్చారు.