ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సైన్యాన్ని పంపినారు. వారిపై అన్సార్లలోని ఒక వ్యక్తిని నాయకుడిగా నియమించి, అతనికి విధేయత చూపమని వారిని ఆదేశించారు. ఒక సందర్భంలో ఆ నాయకుడికి వారిపై కోపం వచ్చి, వారితో ఇలా అన్నాడు: "ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు విధేయత చూపమని మిమ్మల్ని ఆదేశించలేదా? వారు "అవును" అని పలికారు. అప్పుడు ఆయన, "నేను మిమ్మల్ని కట్టెలు పోగుచేసి, నిప్పు రాజేసి, ఆపై అందులో ప్రవేశించమని ఆజ్ఞాపిస్తున్నాను" అని అన్నారు. వారు కట్టెలు పోగుచేసి నిప్పు రాజేశారు. కానీ, అందులో వారు ప్రవేశించకుండా ఆగి పోయి, ఒకరినొకరు చూసుకోసాగారు. మరియు వారు ఇలా (తమలో తాము) పలికారు: "మేము నరకాగ్ని నుండి తప్పించుకోవటానికే కదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించాము, మరి మేము అందులో ప్రవేశించాలా?" వారు అలా చర్చించుకుంటూ ఉండగా ఆ అగ్ని జ్వాల ఆరిపోయింది, మరియు ఆ నాయకుడి కోపమూ చల్లారి పోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు దాని గురించి తెలిపినపుడు, ఆయన ఇలా అన్నారు: ఒకవేళ వారు అతడికి విధేయత చూపి, తాము వెలిగించిన ఆ అగ్నిలో ప్రవేశించిన ఉంటే, వారు అందులో శిక్షించబడి ఉండేవారు మరియు దాని నుండి శాశ్వతంగా బయటకు వచ్చేవారు కాదు. సృష్టికర్త (అల్లాహ్)కు అవిధేయత కలిగించే విషయంలో, సృష్టికి (మానవులకు) విధేయత చూపకూడదు. విధేయత అనేది కేవలం ధర్మబద్ధమైన (మంచి) విషయాలలో మాత్రమే తప్పనిసరి, అవిధేయత కలిగించే విషయంలో కాదు.