ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శకునములను విశ్వసించుట గురించి హెచ్చరించినారు – అది ఏదైనా విషయం విన్నపుడు గానీ, లేక దేనినైనా చూచినపుడు గానీ ఏదో చెడు జరగబోతుందని, దానిని దుశ్శకునంగా, కీడు జరుగబోతుందనడానికి సూచనగా, చిహ్నముగా విశ్వసించడం – అది ఏదైనా పక్షిని చూసినపుడు గానీ, లేక ఏదైనా జంతువును చూసినపుడు గానీ, లేక అంగవైకల్యము కలిగిన (ఏదైనా లోపము కలిగిన) వ్యక్తులు ఎవరైనా ఎదురైనపుడు గానీ దానిని దుశ్శకునంగా విశ్వసించడం. హదీసులో కేవలం పక్షి శకునం గురించి మాత్రమే పేర్కొనబడింది, ఎందుకంటే ‘జాహిలియ్యహ్ కాలములో’ (ఇస్లాంకు ముందున్న అఙ్ఞాన కాలములో) పక్షి శకునం బాగా ప్రసిద్ధి చెందినది. ఆ రోజులలో ఏదైనా పని తలపెట్టడానికి ముందు; అంటే ఉదాహరణకు: ఏదైనా దూర ప్రయాణంపై బయలుదేరడానికి ముందు, లేక ఏదైనా వ్యాపారం మొదలుపెట్టడానికి ముందు లేక అటువంటి ఏ విషయంపై అయినా – ముందుగా ఒక పక్షిని గాలిలోనికి ఎగురవేసేవారు. ఒకవేళ ఆ పక్షి కుడి వైపునకు ఎగిరి వెళితే అతడు దానిని మంచి శకునంగా విశ్వసించేవాడు, తాను మొదలు పెట్టాలనుకున్న కార్యాన్ని మొదలుపెట్టేవాడు. ఒకవేళ ఆ పక్షి ఎడమ వైపునకు ఎగిరి వెళితే అతడు దానిని దుశ్శకునంగా భావించే వాడు. తాను మొదలుపెట్టాలనుకున్న కార్యాన్ని మొదలుపెట్టకుండా వదిలివేసేవాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని ‘షిర్క్’ (బహుదైవారాధన) అన్నారు. నిశ్చయంగా ఆ విధంగా విశ్వసించడం షిర్క్ (బహుదైవారాధన) అవుతుంది. ఎందుకంటే అల్లాహ్ తప్ప మరింకెవరూ లేక మరింకేదీ శుభాన్ని కలుగజేయలేరు, మరియు అల్లాహ్ తప్ప మరింకెవరూ లేక మరింకేదీ కీడును, చెడును దూరం చేయలేరు – ఆయన (అల్లాహ్) తనకెవరూ సాటి లేని, భాగస్వాములు లేని, తనకెవరూ సమానులు లేని అద్వితీయుడు, ఏకైకుడు. ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు “ఒక ముస్లిం హృదయంలో (కొన్ని సందర్భాలలో) ఏదైనా విషయానికి సంబంధించి దుశ్శకునం లాంటి భావన ఉత్పన్నం అవుతుంది. అయితే అల్లాహ్ పై సంపూర్ణంగా భరోసా ఉంచడం ద్వారా దానిని అతడు దానిని (అ భావనను) దూరం చేయాలి; దానితో పాటు ఆచరణలో కూడా దానిని అమలుచేయాలి.